ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యం
తుమ్మపాల: ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా సంచార ఐసీటీసీ వాహన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) సంచార వాహనాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వాహనం ఇంటింటికీ వెళ్లి హెచ్ఐవీ, ఎయిడ్స్పై కౌన్సెలింగ్, నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సులభమైన హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు ఈ వాహనం సేవలు దోహదపడతాయని తెలిపారు. ఈ కేంద్రంలో ఒక కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, డ్రైవర్ విధులు నిర్వహిస్తారన్నారు. ఐసీటీసీ, పీపీటీసీ కౌన్సెలర్లు కూడా సేవలందిస్తారని తెలిపారు. దిశ క్లినికల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ సీహెచ్. స్పందన మాట్లాడుతూ వైద్య కేంద్రాలకు దూరంగా ఉండే ప్రాంతాలు, హైరిస్క్ జనాభా ఉన్న, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేసే వలస కూలీలు నివసించే ప్రాంతాలు, హెచ్ఐవీ పాజిటివ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి, డీటీఏటీవో డాక్టర్ కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు.


