లూలూరులో సర్వే పనులను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట : లోపూడి శివారు లూలూరులో సైనిక శిక్షణ కేంద్రానికి అదనపు భూ సేకరణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు రావడతో సర్వే అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే చేస్తే ఆందోళనకు దిగుతామని కూడు పెడుతున్న భూములను మాకు దక్కకుండా చేస్తారా అంటూ సర్వే సిబ్బందిపై రైతులు మండి పడ్డారు. గతంలో భూ సేకరణ ద్వారా వందలాది ఎకరాలు తీసుకుని మా పొట్టలు కొట్టారు... మరలా రెండోసారి మా భూములను లాక్కోని మమ్మల్ని రోడ్డున పడేస్తారా..? అంటూ అధికారులపై మండి పడ్డారు. నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. లోపూడి శివారు లూలూరులో పదేళ్లు కిందట సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో లోపూడి, శింగవరం, బంగారుమెట్ట, ఎల్బీ పురం, వడ్డాది, పొట్టిదొరపాలెం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతుల నుంచి సుమారు 1,300 ఎకరాలు సేకరించి సైనిక శిక్షణ కేంద్రం(డీఆర్డీఓ) ఏర్పాటు చేశారు. మరలా సైనిక శిక్షణ కేంద్రం విస్తరణకు రెండోసారి మరో 550 ఎకరాలు వరకు భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా రైతుల భూముల్లో సర్వే పనులు చేపడుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. గురువారం సర్వే చేయడానికి వచ్చిన రెవిన్యూ అధికారులను వారంతా అడ్డుకున్నారు. గ్రామ సభ పెట్టకుండా, రైతులకు సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని నిలదీశారు. రైతులు అడ్డుకోవడంపై తహసీల్దార్ లక్ష్మి దృష్టికి సర్వే సిబ్బంది తీసుకెళ్లారు. రైతు సంఘ నాయకులతో సమావేశమవుతామని గ్రామ సభ పెడతామని తహసీల్దార్ లక్ష్మి సర్వే సిబ్బందికి సూచించారు.


