గ్రేటర్ బడ్జెట్ రూ.4,047.12 కోట్లు
డాబాగార్డెన్స్(విశాఖ): మహా విశాఖ నగర పాలక సంస్థ 2026–27 వార్షిక బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. కూటమి సభ్యులు(తెలుగుదేశం, జనసేన, బీజేపీ), వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు బడ్జెట్ను ఆమోదించడం గమనార్హం. ముందుగా బడ్జెట్కు సంబంధించి మేయర్ పీలా శ్రీనివాసరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి వివిధ విభాగాలకు సంబంధించి ఎంతెంత కేటాయించారో వివరించారు.
బడ్జెట్ ఇలా..
ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3,814.41 కోట్లు కాగా, మొత్తంగా రూ.4,180.37 కోట్లు ఆదాయంగా పేర్కొన్నారు. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4,047.12 కోట్లుగా, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. 2025–26 సవరించిన బడ్జెట్ రూ.4,070.19 కోట్లుగా చూపారు. 2026–27 ఏడాదికి ఆశించిన జమల్లో రూ.1,101.80 కోట్ల పెరుగుదల ఏర్పడింది.
పన్నులు ఇలా..
జీవీఎంసీ వసూలు చేస్తున్న ఇంటిపన్ను, ఖాళీ జాగా పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు చార్జీలు, స్టీల్ప్లాంట్, పోర్టు తదితర పారిశ్రామిక సంస్థలు చెల్లించాల్సిన పన్నులు, సర్వీసు చార్జీలు, ప్రకటన చార్జీలు, సెల్టవర్స్ చార్జీలు, జంతువులపై పన్ను తదితర ఈ పద్దు కింద రూ.680 కోట్లుగా చూపారు.
పన్నులు కాని ఇతర ఆదాయాలు
నీటి సరఫరా చార్జీలు, పట్టణ ప్రణాళికా విభాగం వసూళ్లు. షాపురూముల అద్దెలు, కల్యాణమండపాల అద్దెలు, లీజులు, బల్క్, సెమీబల్క్, ఇతర నీటి సరఫరా చార్జీలు, వ్యాపార సంస్థల లైసెన్స్ ఫీజులు తదితరవి రూ.869.55 కోట్లుగా చూపారు.
ప్రభుత్వం నుంచి సంక్రమించే ఆదాయం
స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, మోటారు వాహనాల పన్ను, ఆస్తిపన్ను రాయితీ నష్టపరిహారాలు, మెజిస్టీరియల్ జరీమానాలు తదితరవి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.200 కోట్లుగా చూపారు.
ప్రభుత్వ గ్రాంట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్బన్ ఛాలెంజ్ నిధుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.162.50 కోట్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నిధులు రూ.35 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.240 కోట్లు, అమృత్కు రూ.102 కోట్లు, అసియా అభివృద్ధి బ్యాంకు రూ.58 కోట్లు వస్తాయని ఆశించారు.
బడ్జెట్ ఆశాజనకంగా లేదు
బడ్జెట్లో పబ్లిక్ హెల్త్, హార్టికల్చర్, డ్రెయిన్లు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు నిధులు మరింత పెంచి ఉంటే బాగుండేది. బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల నుంచి ముగుస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అభివృద్ధికి నగర ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నించాలి.
–బాణాల శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ
ఆమోదించిన పాలకవర్గం
బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/ బాండ్ల ద్వారా రుణాలు
జోన్–2 మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి, జీవీఎంసీకి అవసరమైన వాటా సొమ్మును 2026–27 ఏడాదికి రూ.457.50 కోట్లు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు/ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని నిధుల సమకూర్చుకునేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు.
గ్రేటర్ బడ్జెట్ రూ.4,047.12 కోట్లు


