రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
మాడుగుల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘ సభ్యుడు బూడి ముత్యాలు నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు, దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించి నేతల ఇళ్లపై గూండాలతో దాడులు చేయించడం ఇందుకు నిదర్శమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి లపై దుష్పచారం చేస్తున్న, పోస్టర్లను ప్రదర్శించిన, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులతో కలసి స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని రెండు ల్యాబ్లు తేల్చిచెప్పడంతో చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. దీంతో తట్టుకోలేక డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించేవారిని అంతం చేయాలన్నదే టీడీపీ నాయకుల కుట్ర అని, దీనిలో భాగంగానే నాలుగు రోజుల్లో అంబటి రాంబాబు, భూమనకరుణాకర్ రెడ్డి తదితర నలుగురు వైఎస్సార్సీపీ కీలక నాయకులపై దాడులు చేశారని తెలిపారు. దర్యాప్తు సంస్థ స్వచ్ఛమైన నివేదిక ఇచ్చినా లడ్డూలో కల్తీ జరిగిందంటూ ప్రకటనలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, ఏఎంసీ మాజీ చైర్మన్ శేనాపతి కొండలరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఎడ్ల హేమంత్ కుమార్, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు, ఎం.కోడూరు సర్పంచ్ గొళ్ళవిల్లి సంజీవరావు, ఎం.కోడూరు ఎంపీటీసీ ముమ్మిన రమణబాబు వైఎస్సార్సీపీ సీపీ నాయకులు కోట్యాడ భాస్కరరావు, పొలిమేర చిన్నారావు, సయ్యపురెడ్డి సత్తిబాబు, బసవా రామపరమేష్, రెడ్డి అరుణకుమార్, రాఖి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


