నేరాల కట్టడికి సీసీ కెమెరాల నిఘా పెంచండి
నక్కపల్లి : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నక్కపల్లి మండలంలో నేరాల అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. మంగళవారం ఆయన నక్కపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదవుతున్న క్రైమ్ వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి సిబ్బంది పనితీరు, పరిసరాల వాతావరణాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి క్రైమ్ప్రోన్ ఉన్న ప్రాంతాలో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై వాహనాలను అనవసరంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, విజిబుల్ పోలీసింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నాటు సారా తయారీ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీఐ మురళి, ఎస్ఐలు సన్నిబాబు, సాహిబా అంజుమ్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


