373 గ్రామాల్లో రీ సర్వేపూర్తి
నక్కపల్లి : జిల్లాలో ఇప్పటివరకు 373 గ్రామాల్లో రీ సర్వేపూర్తయిందని కలెక్టర్ విజయ్కృష్ణన్ తెలిపారు. మంగళవారం ఆమె కాగితలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్దాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల్లో 2,01,841 మందికి పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని మండలాల్లో సంబంధిత గ్రామాల్లో సచివాలయం వద్ద షెడ్యూలు ప్రకారం రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రీ సర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి శుద్ధమైన రికార్డులతో రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కొరకు రైతులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ సేవలన్నింటిని గ్రామ స్థాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వి.వి.రమణ, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. పునరావాస కాలనీలో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలు పురోగతిపై సమీక్షించారు.
నిర్వాసితులకు ప్యాకేజీ పరిహారం చెల్లింపులు పూర్తయినందున నివాసప్రాంతాలు ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్లి ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ మహేష్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణరావు, సర్పంచ్ రాజేష్ రైతులు పాల్గొన్నారు.


