సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.
‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.
‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు కలెక్టర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.


