సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తున్న కారణంగా నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సిటీ నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో పోలీసులు కూటమి సర్కార్కు వత్తాసు పలుకుతున్నారు. నిన్న రాత్రి నుంచే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్లారు. గోడకు నోటీసు అంటించి పోలీసులు ఫోటోలు తీసుకున్నారు. అనంతరం, వెంటనే నోటీసులు తొలగించి పోలీసులు వెళ్లిపోయారు. దీంతో, నోటీసులు ఇచ్చినట్టు కవరింగ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టించి.. సిటీకి నలువైపులా చెక్పోస్టులు పెట్టి.. వైఎస్సార్సీపీ నేతలు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారు.
మరోవైపు.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో సెక్షన్-30 అమలులో ఉంది కాబట్టి ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించకూడదని పోలీసులు ప్రకటన చేశారు. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు హడావిడి చేశారు. పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, నంబూరు శంకర్రావు, బలసాని కిరణ్ కుమార్, వేమారెడ్డి అంబటి మురళి, విడుదల రజిని, పానుగంటి చైతన్య, మేరుగు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, దొంతి రెడ్డి వేమారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. గుంటూరులో వైఎఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పార్టీ కార్యకర్తలు పాల్గొనకుండా నోటీసులు ఇస్తున్నారు.


