బాబు ఫ్లెక్సీ కుట్రలు..
అబద్ధపు ప్రచారాలకు పోలీస్ పహారా, టీడీపీ గూండాల రక్షణ
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా వెలిసిన ఫ్లెక్సీలు ఎక్కడివక్కడే..
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కూడా అధికారుల అండ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పట్టించుకోరా?
నల్లపాడు పీఎస్లో ఫిర్యాదు అందినా స్పందించని అధికారులు
ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి ప్రజలను నమ్మించేందుకు అధికార పార్టీ చేపట్టిన అసత్య ప్రచారం సామాన్యులకు ఇబ్బందికరంగా మారిందని గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకుంటున్నారు. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్న ఫ్లెక్సీలను తొలగించాల్సిన పోలీసులు వాటికి పహారా కాస్తూ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఉన్నారా? లేక అధికార పార్టీ చెప్పినట్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుంటూరు రూరల్: శాంతిభద్రతలకు భంగం కలిగించేలా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దంటూ నిమిషాల్లో తొలగించే మున్సిపల్ అధికారులు ఇప్పుడు మిన్నకుండి పోయారేంటని ప్రజలు నిలదీస్తున్నారు.
రక్షణ కల్పించి మరీ...
రాష్ట్రంలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తూ ఎందరో సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఫ్లెక్సీలకు ఒక పక్క పోలీసులు పహారా కాస్తుంటే. మరో పక్క టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో రక్షణగా ఉంటున్నారు. ఇదేంటని, రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా? డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? అని మేధావులు సైతం చర్చించుకుంటున్నారు. నేడు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఈ దుస్థితి కల్పించారని పేర్కొంటున్నారు. చిన్నపాటి బర్త్డేలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే తెల్లారేసరికే వచ్చి మున్సిపల్ అధికారులు తొలగిస్తారు. కానీ అసత్య ప్రచార ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్నా... రాష్ట్రం ఆ ఫ్లెక్సీల వల్లే రావణ కాష్టంలా కాలుతున్నా కనీసం ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఫిర్యాదు చేసినా దిక్కేది?
రాష్ట్రంలో విధ్వంసాలకు కారణమైన, సామాన్య ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అటువంటి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప్రముఖ మహిళా న్యాయవాది రజని నల్లపాడు పోలీస్ స్టేషన్లో సీఐకి ఆదివారం ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దాడులకు పాల్పడి, ప్రజా శాంతికి విఘాతం కలిగిచే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజులుగా ఈ ఫిఽర్యాదుపై కనీస చర్యలు చేపట్టలేదని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటం చూస్తే దాడులకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులే అండగా నిలుస్తున్నారా? అని లాయర్ సైతం పలు డిబేట్లలో మాట్లాడినట్లు సమాచారం.


