సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని.. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు అత్యంత హేయం.. వీళ్లందరూ చేసిన తప్పేంటి?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘‘కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల ప్రతిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు దుష్ప్రచారంచేస్తున్నారు. దేవుడంటే చంద్రబాబుకు భక్తి, భయం లేదు. కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ ల్యాబ్లే. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాయి. సీబీఐ ఆధ్వర్యంలో ఈ శాంపిల్స్ అన్నీ టెస్ట్లు జరిగాయి’’ అని వైఎస్ జగన్ వివరించారు.
‘‘ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి. సీబీఐ స్పష్టం చేసినా మళ్లీ గోబెల్స్ ప్రచారానికి దిగారు. కుల, మతాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్తూనే ఫ్లైక్సీలు పెడుతున్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుడికెళ్లి వస్తున్న అంబటిని గూండాలు అడ్డగించారు. పోలీసులు సమక్షంలోనే కర్రలు, రాడ్లతో అంబటిని అడ్డగించారు. అంబటిని బూతులు తిడుతూ కారుపై దాడి చేశారు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.

‘‘బూతులు తిట్టినవారిపైనే అంబటి రియాక్ట్ అయ్యారు. తర్వాత ప్రెస్మీట్ పెట్టి చింతిస్తున్నా అని చెప్పారు. అంబటి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టే వివరణ ఇచ్చారు. అంబటిని హత్య చేసేందుకు యత్నించారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు దాడులు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలున్నా తిడుతూ దాడులు చేశాడు. ఇంటిని ధ్వంసం చేశారు.. ఆఫీసుకు నిప్పుపెట్టారు. దాడుల్లో స్వయంగా ఎమ్మెల్యే భర్త పాల్గొన్నాడు. పోలీసుల సమక్షంలోనే ఐదుకార్లను ధ్వంసం చేశారు
టీడీపీ గూండాలు విధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. టీడీపీ గూండాల కుట్రలో పోలీసులు భాగమయ్యారు. ఎస్పీ డీజీపీ ఆఫీస్లో కూతవేటు దూరంలోనే ఉన్నాయి. సీనియర్ నేత బొత్స ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదు. అంబటి రాంబాబును ఎందుకు అరెస్ట్ చేశారు. దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. తర్వాత రోజు కూడా జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఏకంగా పెట్రోల్ బాంబులతో జోగి ఇంటిపై దాడి చేశారు. ముందు రోజు విడదల రజినిపై కూడా దాడి చేశారు. గుడిబయటే రజినీని అడ్డగించి దుర్భాలాష దాడి చేశారు. తిరిగి విడదల రజినిపైనే కేసు పెట్టారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


