తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ.. | TDP Leaders Illegal Gravel Mining: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..

Feb 10 2026 6:17 AM | Updated on Feb 10 2026 6:18 AM

TDP Leaders Illegal Gravel Mining: Andhra Pradesh

తెల్ల రాయిని తవ్వుకుని తింటున్న మైనింగ్‌ మాఫియా.. తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..

ప్రభుత్వ ఆదాయానికి గండి.. తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి నగదు దండి  

పీసీపల్లి అడ్డాగా..  తమ్ముళ్ల చీకటి దందా  

మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్‌ అధికారులు  

ఫిర్యాదులు వస్తేనే దాడులు

రెవెన్యూ, ఫారెస్ట్‌ భూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు

అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్‌కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం.. మా ఇష్టం అన్నట్లు తెల్ల ఖనిజాన్ని తెలుగు తమ్ముళ్లు కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి మంచి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ అండగా.. తెలుగు తమ్ముళ్ల భాగస్వామ్యంతో అక్రమార్కులు భారీగా తెల్లరాయి తవ్వకాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

కనిగిరిరూరల్‌/పీసీపల్లి: మార్కాపురం జిల్లా కనిగిరి  నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రూ.లక్షలవిలువైన సహజ వనరులను, ఖనిజ సంపదలను ఇష్టాను సారంగా దోచుకుంటున్నారు. ఆరు మండలాల్లో రెవె న్యూ, ఫారెస్ట్, కొండ పరివాహక శివారు ప్రాంత భూములను అడ్డాగా మార్చుకుని యంత్రాలతో రాత్రుల్లో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్నిచోట్ల కొంత భూమిని లీజు అనుమతి పొంది.. వారికి ఇష్టమొచ్చినంత తవ్వుతుండగా, మరికొన్ని చోట్ల అసలు అనుమతి అనే మాట లేకుండానే అధికార పార్టీ అండే తమకు లైసెన్స్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తెల్లరాయి ఉన్నా.. కనిగిరి ప్రాంతంలో ఉన్న తెల్లరాయి కి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ గ్రేడ్‌ 1 రకం రాయి లభ్యమవుతుంది. దీంతో కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలకే మైనింగ్‌ మాఫియా ఎక్కువ ప్రాధా­­న్యత ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీ ప్రాంతం అధికంగా ఉండటం.. శివారు ప్రాంతం కావడంతో చెన్నై లాంటి ప్రాంతాలకు వైట్‌క్వార్జ్‌ (తెల్ల రాయిని)ని ఎక్కువగా తరలించే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు స్థానిక టీడీపీ నేతల అండతో ఇక్కడ మకాం వేసి అక్రమ దందా సాగిస్తున్నారు.  

మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు
తెల్లరాయి అక్రమ తవ్వకాల వ్యవహారం అధికారులకు తెలియదంటే పొరపాటే. అధికార పార్టీ నేతల ఒత్తిడి కొంత ఉన్నా.. అక్రమార్జనలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన కొల్లగొట్టిన తెల్ల ఖనిజ ఆదాయంలో అధికారులకు నెలవారీ నజరానాలు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధికారుల సలహాలు, సూచనలతో స్టాక్‌ పాయింట్‌లకు, తవ్వకాలకు కొంత భూములను అనుమతి తీసుకుని వాటిని అధికారులకు చూపి స్తూ ఇతర రెవెన్యూ, ఫారెస్ట్‌ భూములుగా నిర్ధారణ కాని, హద్దులు తేల్చని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రుళ్లు పొక్లైన్లతో, జేసీబీలతో తవ్వకాలు చేసి అనుమతి పొందిన స్టాక్‌ పాయింట్‌ ప్రదేశంలో వేసుకుని తెల్లవారిన తర్వాత తరలిస్తున్నారు. ఇది ఒకరకం దోపిడీ కాగా మరోరకం దోపిడీ అయితే పీసీపల్లి కేంద్రంగా సాగుతోంది. ఇక్కడ అనుమతులుండవు.. అధికారులు రారు.. తమ్ముళ్లదే ఇష్టారాజ్యం. అటవీ, రెవెన్యూ ఇలా ఏ భూముల్లో అయినా రాత్రింబవళ్లు తవ్వకాలు జోరుగా చేస్తుంటారు. ఒక్కో లారీకి 30 నుంచి 40 టన్ను ల ఎగుమతి జరగ్గా.. టన్నుకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని తెలిసింది. వారానికి నాలుగు లారీల చొప్పున తెల్లరాయి తరలిస్తున్నాయి.  

పీసీపల్లి  అడ్డాగా..  పచ్చనేతల చీకటి  దందా  
పీసీపల్లి మండలంలో మైనింగ్‌ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. మండలంలోని అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ కుమారుడు నేరేడుపల్లి, లక్ష్మక్కపల్లిలో గుంటూరు లింగన్నపాలెం, అడవిలోపల్లి, మెట్లవారిపాలెం, గుంటుపల్లి, తురకపల్లి, మురిగమ్మి  గ్రామాల్లో అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నారు. మురగమ్మిలో 20 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూములు, నేరేడుపల్లిలో 25 ఎకరాల్లో, గుంటుపల్లిలో 10 ఎకరాల్లో, తురకపల్లిలో 15 ఎకరాల్లో, లక్ష్మక్కపల్లిలో (మాలకొండకు పోయే దారిలో) 20 ఎకరాల్లో, లింగన్నపాలెంలో 5 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూముల్లో నెల్లూ­రు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నేతల అండతో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు.

గడిచిన కాలంలో ఒక్క మురగమ్మి ప్రాంతంలోనే మైనింగ్‌ శాఖ అధికారులు ఐదు సార్లు దాడులు చేసి లారీలను, జేసీబీలను, తెల్లరాయిని పట్టుకున్నారు. అయినా తెల్లరాయి దందాను తమ్ముళ్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పీసీపల్లి నుంచి నెల రోజుల వ్యవధిలో సుమారు ఒక వెయ్యి టన్నుల మేర అక్రమార్కులు గ్రేజింగ్, అటవీ పోరంబోకు భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు అంచనా. అనుమతి (లీజు) పొందిన ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు చూపిస్తూ.. పది శాతం చలానా చెల్లించి.. 100 శాతం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.

ఫిర్యాదులు చేస్తేనే కదలిక
మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు తెల్లరాయి ఖనిజాల తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఆ వైపు అడుగులు వేసిన దాఖలాలు లేవు. మైనింగ్‌ శాఖ రాష్ట్ర అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. నామ్‌కే వాస్తే రెండు నెలలకొకసారి మేమున్నాం అంటూ ఒకటి రెండు కేసులు పెట్టి మమ అనిపిస్తారు. కొంతకాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల శివారు ప్రాంతాల్లో చీర్లదిన్నె, నాగిరెడ్డి కొండల మధ్య ఫారెస్ట్‌ బీట్‌ భూముల్లో టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్‌ తవ్వుతుండగా ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు.

భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అయితే సుమారు 10 టన్నుల రాయి స్టాక్‌ మాత్రమే దొరకడంతో రూ.1.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిసింది. గత గురువారం రాత్రి మురిగమ్మి కొండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని మైనింగ్, విజిలెన్స్‌ ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ లారీ, జేసీబీ సీజ్‌ చేశారు. బల్లిపల్లి ప్రాంతంలో తెల్లరాయి తవ్వకం విషయంలో కూటమి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.

తెల్లరాయి తవ్వకం ప్రాంతాలు ఇవే..
కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి మండలం బల్లిపల్లి, అడ్డరోడ్డు, చీర్లదిన్నె, బాల వెంకటాపురం, వెలిగండ్ల శివారు ప్రాంతాలు, నాగిరెడ్డిపల్లి, పీï­Üç­­³ల్లి మండలంలో గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మురిగమ్మి, పామూరు మండలం మార్కొండాపురం,నాసికాత్రయంబకం తది తర ప్రాంతాల్లో రెవెన్యూ, ఫారెస్ట్‌ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement