నెల్లూరులో జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేస్తున్న కాకాణి, చంద్రశేఖరరెడ్డి, ఆనం విజయ్కుమార్రెడ్డి తదితరులు
మైనార్టీ ఆస్తుల పరిరక్షణకు నడుం కట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెట్వర్క్ : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. ఆ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అమరావతి నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి సాకుతో వక్ఫ్ ఆస్తుల కాజేతకు కూటమి సర్కారు పన్నుతున్న కుట్రలపై కన్నెర్రజేసింది. మహోద్యమానికి సిద్ధమని హెచ్చరించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఖాసీం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ముస్లింలు నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా తదితరులు పాల్గొన్నారు.
⇒ ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాల్గొని జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే జేసీ తమ మాటలను సరిగా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
⇒ వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధర్నా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వైఎస్సార్సీసీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. తొలుత ముస్లింలు భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్లోని డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు.
⇒ నెల్లూరులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలు ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరు కలెక్టరేట్లో జేసీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 72 ఎకరాల స్థలాన్ని కాజేయడానికి కూటమి సర్కారు యతి్నంచడంపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.


