ఇష్టానుసారంగా, అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు..
అమిత జనాదరణ కలిగిన నేతైనందున తక్షణమే జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి
ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి..
కేంద్ర హోం శాఖకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం లేఖ
సాక్షి, అమరావతి: అమిత జనాదరణ గల నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం విమర్శించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ఆయన ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు.
సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా, తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. భద్రతా బృందానికి గానీ, పార్టీ ప్రతినిధులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు.
ఆ మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని తలశిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రొటోకాల్స్ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు.
⇒ 2025 ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించినప్పుడు పూర్తి స్థాయిలో జెడ్ప్లస్ భద్రత కల్పించలేదని, బాధ్యత వíßæంచాల్సిన అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
⇒ 2025 ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటన సందర్భంగా కూడా తీవ్ర భద్రతా లోపాలు జరిగాయని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన దాడిలో హెలికాప్టర్ విండ్ïÙల్డ్ దెబ్బతిని వీవీఐపీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ అధికారుల వైఫల్యాన్ని అంగీకరించకుండా పార్టీ నేతలపై కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు.
తరచూ నిబంధనలు నీరుగారుస్తున్న పోలీసులు
తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనల ద్వారా జెడ్ ప్లస్ భద్రతా నిబంధనలను పదేపదే పోలీసులు నీరుగారుస్తున్నారని తలశిల మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా వీఐపీ భద్రతా వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూట్ మార్పులపై తక్షణం విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక నుంచైనా రాజకీయాలకతీతంగా జెడ్ ప్లస్ భద్రతా ఎస్ఓపీలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ జగన్ భద్రతపై స్వతంత్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


