శ్రీశైలం దర్శన ఏర్పాట్లలో అలక్ష్యంపై మండిపాటు
క్యూలైన్ల గేట్లు పగులగొట్టి.. ఆలయంలో బైఠాయించి నినాదాలు
సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈవో డౌన్డౌన్ అంటూ ధర్మాగ్రహం
భారీగా తరలివచ్చిన శివస్వాములు, పాదయాత్ర భక్తులు
నియంత్రించలేక చేతులెత్తేసిన అధికారులు
గంటలతరబడి క్యూలైన్లలో చంటిపిల్లలు, వృద్ధుల నరకయాతన
ఉచిత దర్శన ప్రవేశ ద్వారం వద్ద ఎండలో రోడ్డుపైనే పడిగాపులు
శివయ్య దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగిన వేలాదిమంది
అస్వస్థతకు గురైన భక్తులను తీసుకువచ్చేందుకు దారి లేని వైనం
నిర్లక్ష్యాన్ని భరించలేక శివ స్వాముల్లో కట్టలు తెంచుకున్న అసహనం
స్వాములపై లాఠీ ఎత్తి ఏఎస్పీ యుగంధర్రెడ్డి అత్యుత్సాహం
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి సర్కారు విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా సోమవారం బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. భక్తులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు అల్లాడిపోయారు.
శివస్వాములూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకూ అధికారులు రద్దీని నియంత్రించలేకపోవడంతో శివస్వాముల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, ఆలయంలో బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో చాలా మంది శివస్వాములు, భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకోకుండానే ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లారు.
ఘాట్ రోడ్లలో స్తంభించిన ట్రాఫిక్
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిసినా ముందస్తు అంచనా వేయడంలో బాబు సర్కారు, దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న రద్దీ సాయంత్రం నుంచి పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల్లో, పాదయాత్రగా భక్తులు పోటెత్తారు. అలాగే ఆదివారం రాత్రి భారీగా తరలివస్తున్న వాహనాలతో ఇరు వైపులా ఘాట్రోడ్లలో, శ్రీశైలంలో ట్రాఫిక్ స్తంభించింది.
చేతులెత్తేసిన దేవస్థానం
ఈ నెల 8 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే అధిక సంఖ్యలో తరలివచ్చిన శివస్వాములకు స్పర్శదర్శనం కల్పించడంలో దేవస్థాన అధికారులు విఫలమయ్యారు. సాధారణ భక్తులను, శివస్వాములను నియంత్రించలేక దేవస్థాన అధికారులు చేతులెత్తేశారు.
ఎండలో కాళ్లు కాలుతున్నా.. భక్తుల పడిగాపులు
భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమవడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండలో రోడ్డుపై భక్తులు బారులు తీరారు. ఎండవేడిమికి మహిళలు, చంటిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500అతిశీఘ్ర దర్శనం క్యూలైన్ల వద్ద వేచిఉన్న భక్తులకు రోడ్డుపై మ్యాట్ కూడా వేయలేదు. ఎండలో కాళ్లు మాడుతున్నా.. భక్తులు అలాగే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న శివస్వాములు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చి క్యూలైన్లతాళాలను పగులగొట్టి, తాత్కాలిక క్యూలైన్ల ఇనుప మెష్లను తొలగించి, ఇత్తడి క్యూలైన్లను తొలగించే యత్నం చేశారు. ఆలయంలోని మనోహర గుండం వద్ద పెద్ద ఎత్తున శివస్వాములు బైఠాయించారు. సీఎం, డిప్యూటీ సీఎం, దేవస్థాన ఈఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సనాతన ధర్మం అంటూ బీరాలు పలికే సీఎం, డిప్యూటీ సీఎం పాలనలో ఇంత అధ్వానంగా దేవస్థానం వ్యవస్థ ఉండడం మా ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివస్వాములపై లాఠీ ఎత్తిన ఏఎస్పీ
శివస్వాములను నియంత్రించేందుకు వచ్చిన నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. శివస్వాముల పై లాఠీ ఎత్తారు. దీంతో భక్తులు ఆగ్రహంచి ఏఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి ఏఎస్పీ అక్కడి నుంచి నిష్క్రమించడంతో శివస్వాములు శాంతించారు.


