సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని నయవంచనకు గురి చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతికి పైసా కేటాయించ లేదు. ఆడబిడ్డ నిధి పథకానికి ఈసారి సున్నా పెట్టింది. ప్రతీ మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇచ్చిన హామీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా మోసం చేసింది.
కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అరకొర కేటాయింపులతో అన్నదాతల్ని వంచనకు గురి చేసింది. ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది.
ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు
ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు, అందులోని విద్యార్థుల్ని చిన్నచూపు చూసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై బడ్జెట్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా రూ. 7800కోట్ల పనులు చేపట్టింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చి దిద్దింది. తాజా, బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నాడు నేడు పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కేవలం తూతూ మంత్రంగా రూ.1500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ నిలిపివేస్తున్నట్టు మంత్రి పయ్యావుల ప్రకటించారు.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చిన సంస్కరణలపై కక్ష సాధింపు చర్యగా.. పేద విద్యార్థులకు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లను దూరం చేసిందంటూ ఏపీ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


