రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక
అంబటి ఇంటిపై దాడి నష్టం చేసింది
శ్రీవారి లడ్డూ వ్యవహారాన్ని కక్ష సాధింపుగా భావిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. గుంటూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రెస్మీట్ పెట్టి, చేసిన హెచ్చరికలు ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణం అయ్యాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే..
» తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ ఛార్జిషీట్ స్పష్టం చేసినప్పటికీ, అదేపనిగా ఇంకా ప్రభుత్వం దు్రష్పచారం చేస్తుండటాన్ని అత్యధికులు తప్పు పడుతున్నారు.
» ప్రతిపక్షంగా ఈ విషయంపై వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతుండటం సహజమని, ఎందుకంటే ఆ రోజు జంతువుల కొవ్వు కలిపారని చెప్పింది ప్రభుత్వ పెద్దలే కనుక.. ఈ మాత్రం ప్రభుత్వ పెద్దలను నిలదీయడంలో తప్పు లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
» ఇప్పటికైనా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, మళ్లీ విచారణ అంటూ నిర్ణయం తీసుకోవడం కక్ష సాధింపుగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు.
»ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడినందుకు శనివారం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించాయని, వెంటపడి వేధించాయని.. ఓ దశలో ఆయన్ను తీవ్రంగా రెచ్చగొట్టారని.. అందువల్లే ఆయన పరుషంగా మాట్లాడారని చెబుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన స్థానంలో ఎవరున్నా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతారని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
» మళ్లీ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగడం, కార్లు, కార్యాలయంలో ఫరి్నచర్ను ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదని తప్పుపడుతున్నారు.
» ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరుకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన్ను చూడటానికి వచ్చారు. చాలా చోట్ల బారికేడ్లు పెట్టినా మహిళలు సైతం రోడ్డుపైకి రావడం కనిపించింది.


