కేంద్రం అప్పుగా ఇస్తామన్న సాస్కీ నిధుల నుంచి రూ.2,123 కోట్లతో రోడ్ల మంజూరుకు గతేడాది డిసెంబరులో ఉత్తర్వులు
ఇప్పుడు ఆ రోడ్లను మార్చి అవే డబ్బులతో కొత్తగా 4122 కి.మీ. మేర 1392 రోడ్ల మంజూరుకు మళ్లీ ఆదేశాలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రత్యేకించి తగినన్ని నిధులు లేని పద్దు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా రూ.2,123 కోట్ల రోడ్ల పనులు మంజూరు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ రోడ్ల పనులకు భారీగా మార్పులు చేస్తూ బుధవారం కొత్తగా మరో ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో రాష్ట్ర గ్రామీణ రహదారుల బలోపేతం ప్రాజెక్టు కింద 4007 కిలోమీటర్ల పొడవున 1299 గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.2,123 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆయా రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ఆ ఉత్తర్వులో పేర్కొన్నఆర్థిక శాఖ పద్దులో తగిన నిధులు కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే, ఆయా రోడ్ల పనులను మంజూరుకు పరిపాలనపరమైన అనుమతులు తెలిపి దాదాపు రెండు నెలలు పూర్తవలేదు. అందుకు అవసరమైన నిధుల పైనా ఇంకా స్పష్టత లేదు. కానీ బుధవారం రెండు నెలల క్రితం మంజూరు చేసిన పనులను భారీగా మార్పులు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు మంజూరు చేసిన 4007 కిలోమీటర్లకు సంబంధించిన 1299 పనుల స్థానంలో అదే రూ.2123 కోట్ల ఖర్చుతో కొత్తగా 4,122 కిలోమీటర్లకు సంబంధించిన 1392 రోడ్డు పనులకు పరిపాలనా అనుమతులిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది.
ఆయా పనుల వివరాలను కూడా ఉత్తర్వులకు జత పరిచింది. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో కూడా ఈ పనులకు అవసరమయ్యే నిధులకు పాత జీవోలో పేర్కొన్న ఆర్థిక శాఖ పద్దునే పేర్కొంది. ఆ పద్దుకు ఇప్పటికీ తగిన నిధుల కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, ఈ ఆర్థిక ఏడాది లేదా వచ్చే ఆర్థిక ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రమిచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ– స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని పేర్కొనడం గమనార్హం.


