నేనే కాదు.. మరో ఐదుగురితోనూ అరవ రాసలీలలు
బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో
మానవ హక్కుల కమిషన్ మద్దతుతోనే కేసు నమోదు
కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వెల్లడి
బంజారాహిల్స్: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అసెంబ్లీ నుంచి ప్రతిసారీ కాల్ చేసేవాడని, అక్కడ జరిగే అన్ని విషయాలూ చూపించేవాడని అతని బాధితురాలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని కమలాపురికాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మద్దతుతోనే కేసు నమోదైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను రూ.25 కోట్లు తాను అడగలేదని స్పష్టం చేశారు. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయిందని పేర్కొన్నారు.
అరవ శ్రీధర్ తనతోనే కాకుండా మరో ఐదుగురితోనూ రాసలీలలు నడిపేవాడని చెప్పారు. తనకు ఆ విషయాలు తెలిశాక ఇదంతా ఆపేద్దామని అన్నానని, అందుకే సేఫ్ సైడ్గా అన్ని ఆధారాలూ ఉంచుకున్నానని పేర్కొన్నారు. తనను అతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం వాళ్ల ఇంట్లో వారందరికీ తెలుసునని వివరించారు. టీడీపీ నేత ముక్కా రూపానందరెడ్డే వెనుక ఉండి శ్రీధర్ను నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి కాల్స్ చేయడం నిబంధనలకు విరుద్ధం కదా..! దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్కు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.
విచారణ కమిటీ వేయాలి: న్యాయవాది ఆజాద్
బాధితురాలి తరఫు న్యాయవాది ఆజాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేపై మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరుతున్నట్లు చెప్పారు. బాధితురాలు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫుల్ ఆడియో లేదని పేర్కొన్నారు. ఆ ఆడియో ఉంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్ర మే అని అఫిడవిట్లో ఉందని, అలాంటిది రూ.25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారని, మరి ఏపీ అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్పై స్పీకర్ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు.
సాక్ష్యాలు కోర్టులోనే సమర్పిస్తా
మరో వీడియో విడుదల చేసిన అరవ శ్రీధర్ బాధితురాలు
పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో సాక్ష్యాధారాలను కోర్టులోనే సమర్పిస్తానని బాధితురాలు తెలిపారు. బుధవారం ఆమె మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ తన వాదనలు వినిపించారని, తనకూ త్రిసభ్య కమిటీ నుంచి పిలుపు వచ్చిందని వెల్లడించారు.
త్రిసభ్య కమిటీ ముందు హాజరై అన్ని విషయాలూ వివరిస్తానని చెప్పారు. సాక్ష్యాధారాలను మాత్రం కమిటీకి ఇచ్చే ప్రసక్తే లేదని, కోర్టులోనే సమర్పిస్తానని ఆమె స్పష్టంచేశారు. ఎమ్మెల్యేపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వల్ల తాను ఐదుసార్లు గర్భం దాల్చానని సంజీవని హాస్పిటల్లో స్కానింగ్ చేసుకున్నానని చెప్పారు.
సంజీవని హాస్పిటల్కు ఎమ్మెల్యే శ్రీధర్ ఫోన్ చేసి అబార్షన్ చేయాలని చెప్పడంతోనే తనకు ఆస్పత్రి వర్గాలు మాత్రలు ఇచ్చారని వెల్లడించారు. అబార్షన్ చేయించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో ఆధారాలు, రిపోర్టులు తన దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మహిళా కమిషన్ను కలిసి వివరాలు సమర్పించి న్యాయం కోసం డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు.


