సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.
సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు.


