అనంతపురంలోని పూలే విగ్రహం వద్ద బైఠాయించిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ తదితరులు
పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్సార్సీపీ
రెడ్బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ను బిహార్లా మార్చేశారు
టీడీపీ గూండాలు, అరాచకశక్తుల విధ్వంసకాండపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, కాపు, బీసీ, ప్రజా సంఘాల ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదాస్పద ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని డిమాండ్
చంద్రబాబు, పవన్, లోకేశ్ నిరాధార ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు
మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల భేటీ
జంగిల్ రాజ్యాధిపతి అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగడతామన్న వైఎస్సార్సీపీ నాయకులు
పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని... తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
న్యాయస్థానాలు, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని వెల్లడి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే కాపు నేత అంబటి రాంబాబు, బీసీ నేత జోగి రమేష్పై టీడీపీ గూండాల హత్యాయత్నం
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ నివేదిక... గీతం వర్సిటీకి అడ్డగోలు భూ పందేరం నుంచి డైవర్ట్ చేయడానికే ఈ దాడులు
జంగిల్రాజ్ అరాచకాలను రాజ్యసభలోనూ కేంద్రం దృష్టికి తెచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ..
టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదు
తిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.


