అహ్మదాబాద్ పిచ్పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్ పిచ్నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- న్యూజిలాండ్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్ సాంట్నర్ పలు విషయాలపై స్పందించాడు.
హై స్కోరింగ్కు అవకాశం
పిచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్ ఫ్లాట్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్ (Mitchell Santner) పేర్కొన్నాడు.
మా లక్ష్యం అదే..
అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నది.
హృదయాలు ముక్కలు చేస్తాం
ఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్ కామెంట్ చేశాడు.
కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్పై గెలిచి టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీకి ముందు భారత్.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది.


