హోటల్‌ మారితే అదృష్టం మారేనా! | Interesting Facts About The Indian Cricket Team Revealed, Team India Changes Hotel And Dressing Room Ahead Of T20 World Cup Final | Sakshi
Sakshi News home page

హోటల్‌ మారితే అదృష్టం మారేనా!

Mar 7 2026 4:01 AM | Updated on Mar 7 2026 4:24 PM

Interesting facts about the Indian cricket team revealed

‘సెంటిమెంట్‌’లపై భారత్‌ చూపు 

అహ్మదాబాద్‌: నమ్మకం లేదా సెంటిమెంట్‌ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్‌కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. 

సెమీఫైనల్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్‌ కోసం మరో సెంటిమెంట్‌ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లో 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. నాటి మ్యాచ్‌లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. 

ఇప్పుడు టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్‌ స్కైలైన్‌లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్‌ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్‌ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను వాడుకోవాలని కూడా టీమ్‌ నిర్ణయించింది.  

అంపైర్లను ప్రకటించిన ఐసీసీ 
భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్‌ వార్ఫ్‌ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్‌ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్‌ పలేకర్, ఆడ్రియాన్‌ హోల్డ్‌స్టాక్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్‌ రిఫరీగా వరల్డ్‌ కప్‌ తుది పోరు జరుగుతుంది.  

సామ్సన్‌ నామినేట్‌... 
టి20 వరల్డ్‌ కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన సంజు సామ్సన్‌ పేరు కూడా ఉంది. సామ్సన్‌తో పాటు విల్‌ జాక్స్‌ (ఇంగ్లండ్‌), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌), రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫెర్ట్‌ (న్యూజిలాండ్‌), షాడ్లీ వాన్‌ షాల్‌విక్‌ (అమెరికా), మార్క్‌రమ్, ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు.  

బుమ్రా కూడా విఫలం కావచ్చు! 
భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్‌కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. 

యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్‌ చెప్పాడు. భారత్‌తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్‌లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్‌ వరల్డ్‌ కప్‌లాంటి వేదికపై భారత్‌తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement