టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.
ఈ నేపథ్యంలో భారత్తో ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.
ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో
కాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.
దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.
అతడు కూడా మనిషే కదా!
‘‘ఇటీవల టీమిండియా సిరీస్లో భాగంగా బుమ్రా బౌలింగ్లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.
బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. అయితే, అతడి మీద మాకు మంచి రోజు అయ్యేది ఫైనలే ఎందుకు కాకూడదు?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.
చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్


