సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్‌ | Not Sanju He Should Have Been Player Of The Match: Ex India Star | Sakshi
Sakshi News home page

సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్‌

Mar 6 2026 6:17 PM | Updated on Mar 6 2026 6:49 PM

Not Sanju He Should Have Been Player Of The Match: Ex India Star

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.

టైటిల్‌ పోరుకు అర్హత
టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ చిచ్చర పిడుగు జేకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్‌ చూపించాడు.

కీలక సమయంలో రాణించి
పద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్‌ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్‌. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.

సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు
యార్కర్లు, స్లో బాల్స్‌ వేస్తాడు.. అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాల్సింది.

ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్‌ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు.

అక్షర్‌ పటేల్‌ సైతం
కాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మరోవైపు.. అక్షర్‌ పటేల్‌ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement
 
Advertisement
Advertisement