2026 టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్, ఓ పాకిస్తానీ ప్లేయర్ ఉన్నారు.
భారత్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్) దాల్చాడు. ఆపై సెమీస్లో ఇంగ్లండ్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 89 (42 బంతులు) ఆడి భారత్ను ఫైనల్కు చేర్చాడు.
పాకిస్తాన్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఫర్హాన్ తన జట్టు సూపర్-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన ఫర్హాన్.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్తో 383 పరుగులు చేశాడు.
ఇతర నామినీలు
విల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.
రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.
ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.
టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్లో 58.
లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.
షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు.
కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది.


