ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఎడిషన్లో, ఓవరాల్గా నాలుగోసారి ఫైనల్కు చేరింది.
నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్ల విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.
బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందు భారత్కు బ్రేక్ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.
19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.
చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.
అంతకుముందు సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహచరులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. స్కై మాటల్లో..
స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండగా, ఇంతటి అద్భుతమైన జట్టును నడిపించడం, ఈ జట్టుతో ఫైనల్కు చేరడం ప్రత్యేక అనుభూతి.
సంజూ శాంసన్ ఇన్నింగ్స్పై
అతను క్రీజులోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలుసుకున్నాడు. వికెట్ బాగుందని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గతేడాది నుంచి పడిన కష్టానికి ఫలితం ఇది. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లండ్ లక్ష్య ఛేదనపై
వారి లక్ష్య ఛేదన ప్రయత్నం అద్భుతం. హ్యారీ బ్రూక్ను చూసి, ఇంకెంత స్కోర్ చేయాలయ్యా అని అడిగాను. వారు చివరి వరకు ఆటలో ఉన్నారు. కానీ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మ్యాచ్ను మలుపు తిప్పారు. బుమ్రా మరోసారి తన ప్రతిభను చూపాడు.
ఫీల్డింగ్పై
ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కృషిని గుర్తించాలి. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఫీల్డ్లో పదారసంలా కదిలారు. అద్బుతమైన క్యాచ్లు పట్టడంతో పాటు పరుగులను నియంత్రించగలిగారు. ప్రాక్టీస్ సెషన్లలో దిలీప్ చేసిన కృషి ఫలించింది.
బ్యాటింగ్ కాంబినేషన్పై
మూడో స్థానం వరకు అన్ని స్థిరంగా ఉన్నాయి. రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శివమ్ దూబేను పంపడం సరైన నిర్ణయం. జట్టు అవసరమైతే నా స్థానాన్ని మార్చడం కూడా సరైనదే.
ఫైనల్పై ఆలోచనలు
ఫైనల్ ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. టైటిల్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ముగించాడు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.


