T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ చిచ్చరపిడుగు | T20 WC 2026: Jacob Bethell Creates history with massive ton against india in semi finals | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ చిచ్చరపిడుగు

Mar 6 2026 7:50 AM | Updated on Mar 6 2026 8:57 AM

T20 WC 2026: Jacob Bethell Creates history with massive ton against india in semi finals

నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 

254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్‌.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్‌ ముందే భారత్‌కు బ్రేక్‌ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 

19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.

ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్‌ బేతెల్‌ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్‌ కంట్రోల్‌ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో  బేతెల్‌ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్‌ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్‌ అలెన్‌ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్‌ తన తొలి ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ, టీ20 ఫార్మాట్‌ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్‌ మొదటివాడు. 

ఇంగ్లండ్‌ తరఫున ప్రపంచకప్‌ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్‌ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్‌ జేకబ్‌దే. ఇంగ్లండ్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక స్కోర్‌ రికార్డు అలెక్స్‌ హేల్స్‌ (116 నాటౌట్‌) పేరిట ఉంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement