నేటి నుంచి ఆస్ట్రేలియాతో డే–నైట్ మ్యాచ్
ఈ టెస్టు తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకనున్న అలీసా హీలీ
ఉదయం గం.10:50 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్వాష్ అయ్యింది. ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్ నైట్ పింక్బాల్ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్ చాంపియన్షిప్లో ఇరు జట్లు చెరో సిరీస్ గెలుచుకున్నాయి.
అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్ 8–8 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది.
అజేయమే కానీ...
ఇక్కడి వన్డే సిరీస్ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్లో హర్మన్ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి.
బ్యాటింగ్లో స్మృతి మంధాన ఫామ్లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్లు కూడా ఆతిథ్య బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి.
ఆత్మవిశ్వాసంతో ఆసీస్
ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్ బాల్’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు.
తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్లతో కూడిన బౌలింగ్ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్ బృందం భావిస్తోంది.
పిచ్, వాతావరణం
ఇది పోటాపోటీ పిచ్. నాణ్యమైన బౌలింగ్కు... పాతుకుపోతే బ్యాటింగ్కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సీజన్ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్.
ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, అనాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్.


