టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.
ఈ మ్యాచ్లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది.
ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.


