Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో! | If you are unable to score runs get out: Abhishek Nayar on India star | Sakshi
Sakshi News home page

Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!: అభిషేక్‌ నాయర్‌

Mar 2 2026 3:43 PM | Updated on Mar 2 2026 3:51 PM

If you are unable to score runs get out: Abhishek Nayar on India star

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లతో మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.

జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం
అనంతరం సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్‌ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో మాత్రం మరోసారి అభిషేక్‌ తేలిపోయాడు.

అవుటైపోవడం బెటర్‌
ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో షిమ్రన్‌ హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిషేక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.

తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్‌. టీ20 క్రికెట్‌లో ఇది కీలకం.

పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు
పరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్‌ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ ఈ నియమాన్ని పాటించకుండా పవర్‌ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.

ఇక అభిషేక్‌ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్‌ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్‌ నాయర్‌.. అభిషేక్‌ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.

కాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 

ఇదిలా ఉంటే.. విండీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ షాయీ హోప్‌ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్‌ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement