స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | He just plays for himself every match: Kris Srikkanth Lambasts WI batter Vs IND | Sakshi
Sakshi News home page

స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Mar 2 2026 12:10 PM | Updated on Mar 2 2026 12:15 PM

He just plays for himself every match: Kris Srikkanth Lambasts WI batter Vs IND

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఆరంభం నుంచి అద్భుత ఆట తీరు కనబరిచిన వెస్టిండీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించి సెమీస్‌ రేసులోకి దూసుకవచ్చిన విండీస్‌.. కీలక మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేసింది.

విండీస్‌ అవుట్‌
తొలుత సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్‌ జట్టు.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా భారత్‌ సెమీస్‌కు దూసుకువెళ్లగా.. వెస్టిండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌.. వెస్టిండీస్‌ సారథి షాయీ హోప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడొక స్వార్థ పరుడు.. తుదిజట్టులో అతడికి చోటు దండగ అంటూ ఘాటుగా విమర్శించాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం సరికాదని చురకలు అంటించాడు.

స్వార్థపరుడు..
‘‘ప్రతి మ్యాచ్‌లో కేవలం స్వార్థం కోసం మాత్రమే అతడు ఆడతాడు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. తప్పునంతా పావెల్‌, హోల్డర్‌లపై నెట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆఖర్లో సరిగ్గా ఆడలేదంటూ వారిని నిందించాడు.

నిజానికి నీ చెత్త బ్యాటింగ్‌తో నువ్వే వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవు. నిన్ను కెప్టెన్‌గా నియమించడమే వెస్టిండీస్‌ క్రికెట్‌ చేసిన అతి పెద్ద తప్పు.

తుదిజట్టులో ఉండటమే దండగ
అసలు తుదిజట్టులో షాయీ హోప్‌ ఉండటమే దండగ. అతడు కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ముందుంటాడు. బ్యాట్‌తో రాణించలేడు. అతడికి బదులు వేరొకరిని జట్టులోకి తీసుకుంటే బాగుండేదేమో! నీ బదులు రొమారియో షెఫర్డ్‌ను ఓపెనర్‌గా పంపి ఉంటే బాగుండేది హోప్‌’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ షాయీ హోప్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా కోల్‌కతాలో భారత్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ షాయీ హోప్‌ 33 బంతులు ఎదుర్కొని 32 పరుగులే చేయగలిగాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇక మరో ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ 25 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు.

సంజూ శాంసన్‌ ధనాధన్‌
ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా 20 ఓవర్లలో విండీస్‌ 195 పరుగులు స్కోరు చేయగలిగింది.

అయితే, సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) విజృంభణ కారణంగా టీమిండియా 192. ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది.

చదవండి: IND vs WI అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement