అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌ | World class player all about backing him: Gambhir praises Sanju after WI win | Sakshi
Sakshi News home page

అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

Mar 2 2026 9:34 AM | Updated on Mar 2 2026 10:22 AM

World class player all about backing him: Gambhir praises Sanju after WI win

సంజూపై గంభీర్‌ ప్రశంసలు (PC: BCCI)

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా అతడి స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడాడు.

బాధ్యతాయుత ఇన్నింగ్స్‌
అనంతరం సూపర్‌-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌తో ఆదివారం నాటి కీలక మ్యాచ్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు.

కోల్‌కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.

అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు
‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.

అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్‌ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్‌ సంజూను కొనియాడాడు.

ఐదు వికెట్ల తేడాతో విజయం
కాగా వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement