ఆ్రస్టేలియా ‘హ్యాట్రిక్‌’ | Indian womens team loses in third ODI | Sakshi
Sakshi News home page

ఆ్రస్టేలియా ‘హ్యాట్రిక్‌’

Mar 2 2026 1:13 AM | Updated on Mar 2 2026 1:13 AM

Indian womens team loses in third ODI

మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓటమి

‘శత’క్కొట్టిన అలీసా హీలీ, బెత్‌ మూనీ

ఇరు జట్ల మధ్య 6 నుంచి పెర్త్‌లో ఏకైక టెస్టు  

హోబర్ట్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ చేజిక్కించుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు... వన్డే సిరీస్‌లో ‘వైట్‌వాష్‌’కు గురైంది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్‌ కోల్పోయిన హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు... చివరి మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో వన్డే ప్రపంచ చాంపియన్‌ టీమిండియాపై 185 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా విజయం సాధించి 3–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి వన్డే ఆడిన ఆసీస్‌ కెప్టెన్  అలీసా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు శతకం చేసింది. బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... జార్జియా వోల్‌ (52 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీ సాధించింది. 

ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ షాట్‌లతో స్కోరును నాలుగొందలు దాటించింది. భారత బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్‌ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి శ్రీచరణి 10 ఓవర్లలో 106 పరుగులిచ్చింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్‌గా చెత్త రికార్డును ఆమె మూటగట్టుకుంది.  

వరుస వికెట్లు కోల్పోయి... 
అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా తడబడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. కొండంత లక్ష్యఛేదనలో టీమిండియా ఏ దశలోనూ పోటీలో కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్‌ 
బృందం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (0) డకౌట్‌ కాగా... ప్రతీక రావల్‌ (27; 6 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (29 బంతుల్లో 42; 9 ఫోర్లు) కాస్త పోరాడారు. 

వీరిద్దరూ రెండో వికెట్‌కు 35 బంతుల్లో 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు.కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (25; 2 ఫోర్లు), హర్లీన్‌ డియోల్‌ (14), దీప్తి శర్మ (29; 2 ఫోర్లు), రిచా ఘోష్‌ (18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) విఫలమయ్యారు. స్నేహ్‌ రాణా (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 

ఆసీస్‌ బౌలర్లలో అలానా కింగ్‌ 4 వికెట్లు పడగొట్టింది. అలీసా హీలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 నుంచి పెర్త్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పిన అలీసా తన కెరీర్‌లో 126 వన్డేలు ఆడి 3777 పరుగులు చేసింది. ఇందులో 8 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement