టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఊరట లభించింది. పాటియాలా హౌజ్ కోర్టు అతడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా నివాసి ఆయేషా ముఖర్జీతో ధావన్కు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీశాయి.
ఆయేషాతో విడాకులు
డివోర్సీ, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఆయేషా (Ayesha)ను ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జొరావర్ జన్మించాడు. అయితే, కొంతకాలం తర్వాత ధావన్- ఆయేషా మధ్య తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ఢిల్లీ కోర్టు 2023లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.
సోఫీతో ఇటీవలే వివాహం
ఈ క్రమంలో చాన్నాళ్లు ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్.. ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే (ఫిబ్రవరి 22) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా శిఖర్ ధావన్ కొత్త జీవితం ఆరంభించిన సమయంలో.. మాజీ భార్య విషయంలో న్యాయస్థానం నుంచి అతడికి గొప్ప ఊరట లభించింది.
రూ. 5.7 కోట్లు తిరిగి చెల్లించాలి
శిఖర్ ధావన్ నుంచి ఆయేషా తీసుకున్న రూ. 5.7 కోట్లను అతడికి తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా ఆయేషా- ధావన్ల ఆస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టు ఆయేషాకు 15 శాతం కేటాయించింది. దీని ప్రకారం.. రూ. 7.46 కోట్లతో పాటు ధావన్ నుంచి అదనంగా రూ. 15.95 కోట్లు, దీనితో పాటు కొంత ఆస్తి ఆయేషా పేరిట రాయాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆస్తులకు సంబంధించి 2021-2024 మధ్య ఆస్ట్రేలియా కోర్టు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే, భారత వివాహ చట్టాల ప్రకారం తాను ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పనిలేదని ధావన్ వాదించాడు. ఇందుకు సంబంధించి పాటియాలా హౌజ్ కోర్టులో వివరాలు సమర్పించాడు.
కట్టుకథలు అల్లి
పెళ్తైన కొన్ని నెలల తర్వాత నుంచే ఆయేషా.. కట్టుకథలు అల్లి తన కెరీర్ను దెబ్బతీస్తానని బెదిరించిందని ధావన్ కోర్టుకు చెప్పాడు. అంతేకాదు.. తన కష్టార్జితంతో కొనుగోలు చేసే ప్రతి ఆస్తిని ఇద్దరి పేరిట లేదంటే.. ఆయేషా ఒక్కదాని పేరిటే కొనాలని ఆమె ఒత్తిడి చేసేదని వాపోయాడు.
ఇందుకు తగ్గట్లుగానే ఒకానొక సమయంలో ధావన్ కొన్న ఆస్తులలో దాదాపు 99 శాతం ఆయేషా పేరిటే ఉన్నట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాటియాలా హౌజ్ కోర్టు జడ్జి జస్టిస్ దేవేందర్ కుమార్ గార్గ్.. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ధావన్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
బెదిరించి డబ్బు గుంజాలనే యత్నం
సెటిల్మెంట్ సమయంలో ధావన్ను బెదిరింపులకు గురిచేసి డబ్బు గుంజాలనే ప్రయత్నం జరిగినట్లు గుర్తించామన్నారు. కాబట్టి ఆయేషా ధావన్ నుంచి పొందిన రూ. 5.7 కోట్లను తిరిగి ఇచ్చేయాలని గార్గ్ ఆదేశించారు.
అంతేకాదు.. ధావన్ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయేషాను న్యాయస్థానం ఆదేశించింది. మాజీ దంపతుల వివాదంలో ఆస్ట్రేలియా కోర్టుకు ఎలాంటి అధికారం లేదని.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ విలువలేదని కొట్టిపారేసింది. దీంతో ధావన్కు ఉపశమనం దక్కింది.
కుమారుడికి దూరం
కాగా కుమారుడు జొరావర్ కస్టడీ తనకు కావాలని ధావన్ కోరగా.. న్యాయస్థానం అతడికి శాశ్వత ప్రాతిపదికన కుమారుడిని అప్పగించలేమని తెలిపింది. అయితే, ఇండియా, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో వీడియో కాల్స్ ద్వారా కుమారుడిని చూడవచ్చని పేర్కొంది.
అయితే, ఆయేషా మాత్రం కుమారుడితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేసేందుకు సోషల్ మీడియాతో సహా అన్ని కనెక్షన్లను కట్ చేసిందని ధావన్ వాపోయాడు. కుమారుడిని ఎంతగానో మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ధావన్ తరచూ వెల్లడిస్తూ ఉంటాడు.
చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్


