మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్‌ ధవన్‌ | Shikhar Dhawan Dismisses False Narratives On 1st Wife After 2nd Marriage | Sakshi
Sakshi News home page

మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్‌ ధవన్‌

Feb 24 2026 12:42 PM | Updated on Feb 24 2026 12:53 PM

Shikhar Dhawan Dismisses False Narratives On 1st Wife After 2nd Marriage

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన రెండో వివాహం అనంతరం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన కథనాలపై తీవ్రంగా స్పందించాడు. కొద్ది రోజుల కిందట ధవన్‌ అమెరికా ఆధారిత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సోఫీ షైన్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. 

ఈ వేడుక తర్వాత ధవన్‌, అతని మాజీ భార్య అయేషా ముఖర్జీకి సంబంధించిన పలు పోస్ట్‌లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల సమయంలో అయేషా ధవన్‌ను "నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అన్నట్లు.. సోఫీతో వివాహం తర్వాత "నన్ను అభినందించవా..?" అని ధవన్‌ అయేషాకు కౌంటరిచ్చినట్లు పలు స్క్రిప్ట్‌లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

వీటిపై ధవన్‌ అదే సోషల్‌మీడియా వేదికగా స్పందించాడు. ఆ స్క్రిప్ట్‌ను పూర్తిగా ఖండిస్తూ.. అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. "నేను ఎప్పుడూ గతాన్ని మోసుకెళ్లలేదు. పాజిటివిటీని నమ్ముతాను. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబం, మిత్రులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి నా పేరుతో తప్పుడు కథనాలు సృష్టించవద్దు" అంటూ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.  

కాగా, ధవన్‌.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మహిళల అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి, ఆతర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది. అయేషా ఓ మాజీ కిక్‌ బాక్సర్‌. ఆమెకు ధవన్‌కు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. తొలి భర్తతో అయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయేషా-ధవన్‌కు జోరావర్‌ అనే పేరు గల కుమారుడు ఉన్నాడు.

అయేషా.. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం, జోరావర్‌తో కలిసి ధవన్‌తోనే ఉండేది. అయితే మనస్పర్దల కారణంగా అయేషా-ధవన్‌ 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయేషా జోరావర్‌ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. 

ఆ సమయంలో అయేషా తండ్రి-కొడుకులను కలవనివ్వలేదనే వార్తలు వచ్చాయి. జోరావర్‌ను మిస్‌ అవుతున్నట్లు ధవన్‌ చాలా సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ధవన్‌ ఏనాడూ అయేషా గురించి చెడుగా మాట్లాడలేదు. తాజాగా వస్తున్న వదంతులు ధవన్‌ ఎంత జెంటిల్మెనో మరోసారి రుజువు చేశాయి.

అయేషాతో విడాకులైన చాన్నాళ్లకు ధవన్‌-సోఫీ మధ్య ప్రేమ మొదలైంది. 2025లో వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగం చేశారు. ఈ ఏడాది జనవరి 12న వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ, Northern Trust Corporationలో ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ సహచరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement