T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్‌ | T20 WC 2026: West indies ruined team india semis hopes by huge victory over zimbabwe | Sakshi
Sakshi News home page

T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్‌

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 8:41 AM

T20 WC 2026: West indies ruined team india semis hopes by huge victory over zimbabwe

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్‌ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్‌లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసిన విండీస్‌.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్‌ రన్‌రేట్‌ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్‌రేటే భారత్‌ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్‌రేట్‌ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్‌ రేట్‌ 3.800 వద్ద కూర్చుంది.

ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి భారీ రన్‌ రేట్‌ కూడగట్టుకున్న విండీస్‌, సౌతాఫ్రికా సెమీస్‌ రేసులో ముందున్నాయి. భారత్‌, జింబాబ్వే మైనస్‌ రన్‌ రేట్‌లతో సెమీస్‌ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్‌-8 మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, విండీస్‌) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.

ఎందుకంటే విండీస్‌ రన్‌ రేట్‌ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, భారత్‌) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్‌ గెలిచినా దర్జాగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్‌పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్‌తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్‌తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్‌ బెర్త్‌ సౌతాఫ్రికా వశమవుతుంది.

ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ తలో మ్యాచ్‌లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.

ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్‌ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్‌ రేట్‌ ఉంటుంది. విండీస్‌ భారత్‌ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్‌రేట్‌ ఉంటుంది. ఇలా జరిగి, భారత్‌.. జింబాబ్వే, విండీస్‌పై విజయాలు సాధించినా.. విండీస్‌, సౌతాఫ్రికా రన్‌రేట్‌ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ సెమీస్‌కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్‌.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్‌.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్‌ సెమీస్‌కు చేరుకుంటాయి.

అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్‌ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్‌ ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోష్‌లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్‌ మ్యాచ్‌ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లో విండీస్‌ గెలిచినా భారత్‌ మూడో పొట్టి ప్రపంచకప్‌ కల కల్లగా మారిపోతుంది. 

మొత్తంగా వెస్టిండీస్‌.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్‌ సెమీస్‌ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌ తర్వాత సెమీస్‌ బెర్త్‌లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్‌-1 నుంచి ఓ సెమీస్‌ బెర్త్‌ ఖరారైపోతుంది. రెండో బెర్త్‌ కోసం సౌతాఫ్రికా, భారత్‌, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. 

విండీస్‌ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం​ మాత్రం చాలా కష్టమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement