నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో భారత్ తొలి వన్డే
ఉదయం గం. 9:20 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
బ్రిస్బేన్: టి20 సిరీస్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్లోనూ అదరగొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుతో బ్రిస్బేన్లో నేడు జరిగే తొలి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగనుంది. గత ఏడాది తొలిసారి వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలిచిన తర్వాత భారత్ ఆడబోతున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. నవీ ముంబైలో గత వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన ఆ్రస్టేలియా ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
టి20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ స్టార్ అలీసా హీలీ వన్డే సిరీస్కు కెపె్టన్గా అందుబాటులోకి వచ్చింది. భారత్తో సిరీస్ తర్వాత అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోనుంది. టి20 సిరీస్లో ఆడిన అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్ స్థానాల్లో కాశ్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్ భారత వన్డే జట్టులోకి వచ్చారు.
వన్డే ఫార్మాట్లో ఏకంగా ఏడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఎలీస్ పెరీ, యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, అలీసా హీలీ రూపంలో పలువురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. పటిష్టమైన ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే భారత్ ఓడించాలంటే... బ్యాట్తో స్మృతి మంధాన, హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్... బంతితో రేణుక, క్రాంత్రి, శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
బ్రిస్బేన్ మైదానం ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఎంతో కలిసొచ్చిన వేదిక. ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు ఆడిన 20 వన్డేల్లోనూ విజయం సాధించి అజేయంగా ఉంది. మంగళవారం తొలి వన్డే అనంతరం.... రెండు జట్లు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27న రెండో వన్డే, మార్చి 1న మూడో వన్డే ఆడతాయి. టి20, వన్డే, టెస్టు సిరీస్ ముగిశాక ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీని అందజేస్తారు. టి20 సిరీస్ నెగ్గిన భారత జట్టు ప్రస్తుతం 4–2తో ఆధిక్యంలో ఉంది.


