ఇది సరిపోతుందా బాస్‌!.. విమర్శలకు సంజూ ’స్టైల్‌’ కౌంటర్‌ | Sanju Samson Redemption Arc Puts India Past West Indies Into T20 WC Semis | Sakshi
Sakshi News home page

ఇది సరిపోతుందా బాస్‌!.. విమర్శలకు సంజూ ’స్టైల్‌’ కౌంటర్‌

Mar 2 2026 8:51 AM | Updated on Mar 2 2026 10:05 AM

Sanju Samson Redemption Arc Puts India Past West Indies Into T20 WC Semis

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.

ఈ సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్‌కప్‌ జట్టులో ఓపెనర్‌గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్‌ కిషన్‌ అభిషేక్‌ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.

ఉద్దేశపూర్వకంగానే!
అయితే, అభిషేక్‌ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్‌లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌... తదుపరి జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 రన్స్‌ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్‌ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.

మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. 

అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్‌ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్‌ కప్‌లో కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం ఇందుకు కారణం.

ఒకే ఒక అర్ధ సెంచరీ...
నిజానికి 2024 నవంబర్‌లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్‌ 18 ఇన్నింగ్స్‌లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్‌పై వచ్చింది. వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్‌ కిషన్‌కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.

కెరీర్‌కు కొత్త ఊపు
ఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సంజూ ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.

విండీస్‌తో మ్యాచ్‌లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్‌ పారేసుకోలేదు. అకీల్‌ హొసీన్‌ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ షెఫర్డ్‌ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

టీమిండియాను సెమీస్‌కు చేర్చి
టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్‌కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్‌గా నిలిచిప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్‌కు నాడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు.  

చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్‌!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement