ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్లో పర్యటిస్తున్నాయి.
క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
ఆసీస్ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత వన్డే సిరీస్లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్లోనే ఆసీస్ చేతిలో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
నామమాత్రపు విజయం
సౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే సిరీస్లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.
చమారీ ఆల్రౌండ్ షో
విండీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది.


