మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది.
అయితే, యుద్ధం కారణంగా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్ జట్టు డర్బన్లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.
యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్ క్రికెట్ ప్రపంచంపై పడే అవకాశం ఉంది.
త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది.
ఇదిలా ఉంటే, పాక్ మహిళల క్రికెట్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్ ఊరట పొందింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.


