పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రెండు దేశాలతో పాటు యుద్ధ ప్రభావం.. యూఏఈ, దుబాయి, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలపై కూడా పడింది. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్కి గురిచేస్తున్నాయి.
'మన దేశం.. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేం సహించం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం' అని రష్మి తన ట్విటర్లో రాసుకొచ్చింది. రాడికల్ (అతివాద) ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్లని దయచేసి ఇరాన్కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్ల మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు రష్మి.. వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా వాటికి కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. 'నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నాసరే నా దేశంలో పూర్తి గౌరవంతో వ్యక్తిత్వంతో బతుకుతున్నాను' అని రష్మి చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. .




