టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు.
అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.
డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.
వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.
కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది.


