టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు షెడ్యూలయ్యాయి.
2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వన్డే మ్యాచ్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.
ఈ అంశం ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్-విరాట్ ఎక్కువ మ్యాచ్ల్లో కనబడితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్కు ముందు రో-కోకు వీలైనంత రియల్ ప్రాక్టీస్ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్ పర్యటనలో వన్డే లెగ్ పొడిగించడం దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.
ఐపీఎల్ తర్వాత వన్డేలపై దృష్టి
ఐపీఎల్ 2026 సీజన్ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్ మొదటి వారం నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.
ఐపీఎల్ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్
- జూన్లో ఆఫ్ఘానిస్తాన్తో మూడు మ్యాచ్లు
- జూలైలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లు
- ఆగస్టులో వెస్టిండీస్తో మూడు మ్యాచ్లు
- అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటన
- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్లు


