ఆసీస్తో ఏకైక టెస్ట్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్ను ఎంపిక చేశారు. వర్క్లోడ్ కారణంగా రేణుకా సింగ్కు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు చెప్పారు.
రేణుకా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది, కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుత ఆసీస్ పర్యటనలోనూ 3 టీ20లు (4 వికెట్లు), 2 వన్డేలు (ఒక్క వికెట్) ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేణుకా ఫామ్లో లేకపోయినా ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల భారత పేస్ విభాగం అనుభవం కోల్పోనుంది.
కశ్వీ విషయానికొస్తే.. ఆమెకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆసీస్ సిరీస్లో 3 వికెట్లు తీసి, 68 పరుగులు చేసింది. కశ్వీకి రేణుకా అంత అనుభవం లేకపోవడంతో ఆసీస్ మ్యాచ్లో టీమిండియా పరీక్ష ఎదుర్కోవచ్చు.
భారత పేస్ విభాగంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే, అమంజోత్ కౌర్ కూడా టెస్ట్ స్థాయిలో కొత్తవారే. అనుభవలేమితో భారత పేస్ విభాగం ఆసీస్ బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. మార్చి 6న పెర్త్లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. పింక్బాల్తో జరిగే ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో ఉంటుంది.
కాగా, భారత మహిళల జట్టు మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరగగా భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో చివరిదైన ఏకైక టెస్ట్ మార్చి 6న ప్రారంభం కానుంది. సిరీస్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్ గెలిస్తే సిరీస్ను సమం చేయగలదు.
ఆసీస్తో ఏకైక టెస్ట్కు భారత జట్టు..
స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్, కశ్వీ గౌతమ్
భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
- అలీస్సా హీలీ (కెప్టెన్)
- డార్సీ బ్రౌన్
- మైట్లాన్ బ్రౌన్
- అశ్లే గార్డ్నర్
- లూసీ హామిల్టన్
- అలానా కింగ్
- ఫీబీ లిచ్ఫీల్డ్
- బెత్ మూనీ
- తాలియా మెక్గ్రాత్
- ఎలీస్ పెర్రీ
- అన్నాబెల్ సతర్లాండ్
- జార్జియా వోల్
- జార్జియా వారెహామ్


