పెర్త్లోని ప్రసిద్ధ WACA మైదానం వేదికగా మార్చి 6 నుంచి 9 వరకు భారత్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును నిన్న (మార్చి 2) ప్రకటించారు. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరుగుతుంది.
పేసర్ కిమ్ గార్త్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కాగా.. రాచెల్ ట్రెనమన్, మైట్లాన్ బ్రౌన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరు గాయాల బారిన పడిన స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ, స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యారు.
24 ఏళ్ల ట్రెనమన్కు సీనియర్ జట్టు తరఫున ఇది తొలి అవకాశం. ఇటీవలికాలంలో ఆమె అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్ విమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్లో టస్మానియా తరఫున ఓపెనింగ్ చేస్తూ 81 సగటున 648 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకుంది.
బ్రౌన్ విషయానికొస్తే.. ఈ 28 ఏళ్ల పేసర్ 2021 తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె న్యూ సౌత్ వేల్స్ తరఫున 10 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉంది. గత ఆగస్టులో ఇండియా-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో ఆస్ట్రేలియా A తరఫున ఆడి 4 వికెట్లతో సత్తా చాటింది.
చివరి మ్యాచ్
ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీకి అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్. హీలీ చాలా రోజుల ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. హీలీ.. తాజాగా ఆడిన తన చివరి వన్డేలో అద్భుత శతకంతో (158) చెలరేగిన విషయం తెలిసిందే.
తాజాగా భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత జట్టు ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
- అలీస్సా హీలీ (కెప్టెన్)
- డార్సీ బ్రౌన్
- మైట్లాన్ బ్రౌన్
- అశ్లే గార్డ్నర్
- లూసీ హామిల్టన్
- అలానా కింగ్
- ఫీబీ లిచ్ఫీల్డ్
- బెత్ మూనీ
- తాలియా మెక్గ్రాత్
- ఎలీస్ పెర్రీ
- అన్నాబెల్ సతర్లాండ్
- జార్జియా వోల్
- జార్జియా వారెహామ్


