విశ్వవిజేత భారత్‌కు భారీ షాక్‌ | Australia Women Beat India By 185 Runs In 3rd ODI, Check Out Score Details And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

AUS W Vs IND W: విశ్వవిజేత భారత్‌కు భారీ షాక్‌

Mar 1 2026 5:02 PM | Updated on Mar 1 2026 6:24 PM

Australia women beat india by 185 runs in 3rd ODI

మహిళల వన్డేల్లో విశ్వవిజేత అయిన భారత్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జగజ్జేతగా అవతరించిన తర్వాతి సిరీస్‌లోనే మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

హోబర్ట్‌ వేదికగా ఇవాళ (మార్చి 1) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే దీనికి ముందు ఆసీస్‌లోనే జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. 

జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్‌ చేతులెత్తేసింది. అలానా కింగ్‌ (10-1-33-4), జార్జియా వేర్హమ్‌ (1.1-0-3-2) ధాటికి 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నికోలా కేరీ, సదర్‌ల్యాండ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో వికెట్‌ తీశారు. 

భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్‌ డకౌట్‌ కాగా.. ప్రతీకా రావల్‌ 27, జెమీమా 42, కెప్టెన్‌ హర్మన్‌ 25, హర్లీన్‌ డియోల్‌ 14, దీప్తి శర్మ 29, రిచా ఘోష్‌ 18, శ్రీ చరణి 11 పరుగులు చేశారు. ఓటమి ఖరారయ్యాక స్నేహ్‌ రాణా (44) ప్రతిఘటించింది. 

కాగా, ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ ప్రారంభం కానుంది. పెర్త్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన ముగుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement