టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్న రింకూ తండ్రి ఖాచంద్ర సింగ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఖాచంద్ర సింగ్ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై ఉంచారు.
పరిస్థితి మరింత విషమించడంతో నిన్న రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. వైద్యులు శక్తివంచన లేకుండా కృష్టి చేసినా రింకూ తండ్రిని కాపాడలేకపోయారు.
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసి హుటాహుటిన నోయిడాకు బయల్దేరాడు. అక్కడ రెండు రోజులు గడిపి, జింబాబ్వేతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్ కోసం తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి రింకూ జట్టులో చేరినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయినా, ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
తండ్రి మరణవార్త విని రింకూ హుటాహుటిన తన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. తన సక్సెస్లో తండ్రి పాత్ర చాలా కీలకమని రింకూ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. రింకూ అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగినప్పటికీ.. అతని తండ్రి గ్యాస్ డెలివరీ చేస్తూనే జీవనం సాగించాడు. రింకూ తండ్రి మరణవార్త తెలిసి టీమిండియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


