T20 WC 2026: సెమీస్‌లో భారత్‌ వర్సెస్‌ పాక్‌..? | T20 WC 2026: Still there is chance for India vs Pakistan match in semis, here is how | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సెమీస్‌లో భారత్‌ వర్సెస్‌ పాక్‌..?

Feb 27 2026 7:52 AM | Updated on Feb 27 2026 9:20 AM

T20 WC 2026: Still there is chance for India vs Pakistan match in semis, here is how

టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరబోయే జట్లపై ఓ అవగాహణ ఏర్పడింది. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌-4కు అర్హత సాధించగా.. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, భారత్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకొని కూర్చోగా.. రెండో బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాక్‌ పోటీపడనున్నాయి.

సెమీస్‌ బెర్త్‌లపై ఓ క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమైంది. నిన్న (ఫిబ్రవరి 26) జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్‌ గ్రూప్‌-1 నుంచి విండీస్‌కు ప్రధాన పోటీదారుగా మారగా.. గ్రూప్‌-2లో రెండో బెర్త్‌ న్యూజిలాండ్‌కు దాదాపుగా ఫిక్స్‌ అయ్యింది. అలాగని పాక్‌ అవకాశాలను తీసిపారేయడానికి వీళ్లేదు.

మిగతా జట్ల మాట ఎటున్నా, భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచకప్‌లోనే మరోసారి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్‌లో తలపడాలని వారు ఆకాక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అదెలా అంటే..

ముందుగా భారత్‌ విషయానికి వద్దాం.. జింబాబ్వేపై గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌పై క్లియర్‌ పిక్చర్‌ ఏర్పడింది. తదుపరి మ్యాచ్‌లో విండీస్‌ గెలిస్తే టీమిండియా సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్‌ రద్దైనా మెరుగైన రన్‌రేట్‌ కలిగిన విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది.

సెమీస్‌లో పాక్‌తో తలపడాలంటే భారత్‌ విండీస్‌పై నామమాత్రపు విజయం సాధిస్తే సరిపోదు. ఆ మ్యాచ్‌లో భారత్‌ మంచి రన్‌ రేట్‌తో భారీ విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడాలి. 

అప్పుడు భారత్‌, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ ప్లేసింగ్‌ విషయంలో రన్‌రేట్‌ కీలకమవుతుంది. విండీస్‌పై భారత్‌ భారీ తేడాతో గెలుస్తుంది కాబట్టి రన్‌రేట్‌ కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడితే ఆ జట్టు రన్‌రేట్‌ భారత్‌ కంటే తక్కువై పోతుంది. అప్పుడు గ్రూప్‌ 1 టాపర్‌గా భారత్‌.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంటాయి.

గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచే జట్టు గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచే జట్టును సెమీస్‌లో ఢీకొంటుంది. సెమీస్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగాలి​ అంటే, పాక్‌ గ్రూప్‌-2 నుంచి రెండో స్థానంలో నిలివాలి. ఆ జట్టుకు ప్రస్తుతం అగ్రస్థానికి వెళ్లే ఛాన్స్‌లు లేవు. భారత్‌=పాక్‌ సెమీస్‌లో తలపడాలంటే టీమిండియానే గ్రూప్‌-1లో టాప్‌ ప్లేస్‌లో ఉండాలి.

ఇక పాక్‌ గ్రూప్‌-2లో రెండో స్థానానికి ఎలా చేరుకునే అవకాశం ఉందంటే.. ఈ గ్రూప్‌ నుంచి ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారైపోయింది. పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కాలంటే వారి చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్‌రేట్‌ కూడగట్టుకోవాలి. 

ఇలా జరిగితే పాక్‌ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. సెమీస్‌ బెర్త్‌ కోసం పాక్‌కు పోటీదారుగా ఉన్న న్యూజిలాండ్‌ ఇప్పటికే 3 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, భారీ రన్‌రేట్‌ను కూడా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ తమి చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా, రెండో స్థానంలో సెమీస్‌కు చేరుకుంటుంది. 

కానీ, సెమీస్‌లో మనకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కావాలంటే న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ అతి భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్‌ నెట్‌ రన్‌రేట్‌ బాగా తగ్గిపోతుంది. అప్పటికే శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్‌రేట్‌తో ఉన్న పాకిస్తాన్‌ గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు చేరుతుంది.

అప్పుడు గ్రూప్‌-1 టాపర్‌ భారత్‌.. గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచే పాకిస్తాన్‌ సెమీస్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల వరకు ఇది బాగానే ఉంది కానీ, ఇలా జరగడం చాలా కష్టం. భారత్‌ అష్టకష్టాలు పడి గ్రూప్‌-1లో టాప్‌ ప్లేస్‌కు రాగలదేమో కానీ, ఏదైనా మహాద్భుతం జరిగితేనే పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement