టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-1 సూపర్-8 సమరాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్-వెస్టిండీస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నిన్న (ఫిబ్రవరి 26) వెస్టిండీస్ సౌతాఫ్రికా చేతిలో ఓడటం.. భారత్ జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్పై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం వెస్టిండీస్, భారత్ చెరి రెండు పాయింట్లు కలిగి ఉన్నాయి. రన్రేట్ మాత్రం భారత్తో పోలిస్తే విండీస్ది చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతానికి రన్రేట్ మ్యాటర్ కాదు.
ఎందుకంటే, మార్చి 1న భారత్-విండీస్ మధ్య కోల్కతా వేదికగా జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారే సెమీస్కు చేరతారు. ఒకవేళ ఆ మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే మాత్రం రన్రేట్ అత్యంత కీలకమవుతుంది. మ్యాచ్ రద్దైతే ఇరు జట్ల ఖతాలో చెరి 3 పాయింట్లు ఉంటాయి.
రన్రేట్ విషయానికొస్తే.. విండీస్కు (1.791), భారత్ (-0.100) కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.
అయితే దిగులు చెందాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే.. భారత్-విండీస్ మ్యాచ్కు ప్రస్తుతానికి ఎలాంటి వర్షాటంకాలు లేవు. యాక్యూవెదర్ ముందస్తు సమాచాం ప్రకారం.. మార్చి 1న, ముఖ్యంగా మ్యాచ్ జరిగే 7-12 (రాత్రి) మధ్య సమయంలో ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రత 23 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ ఈ భరోసాతో టీమిండియా అభిమానులు సల్ల బడ్డారు. మ్యాచ్ సజావుగా సాగితే విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయ జట్టుగా ఉండిన వెస్టిండీస్ నిన్న సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి కాన్ఫిడెన్స్ను కోల్పోగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వేపై ఘన విజయం సాధించి టీమిండియా మాంచి జోష్లో ఉంది.
ఇదే జోష్ను విండీస్ మ్యాచ్లోనూ కొనసాగిస్తే భారత్కు సెమీస్ బెర్త్ ఖాయం. సెమీస్లో భారత్.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లలో ఏదో ఒక్క జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది.


