నియమ నిబంధనల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల కిందట ధోని పేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డైంది.
సదరు వాహనం వేగ పరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించడంతో మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ చేశారు. ఈ ఘటన ధోని నివాసం సమీపంలో జరిగింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా, ధోని పేరు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
ఇంతకుముందే మరో వివాదం
దీనికి ముందే ధోని మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాంచీలోని హార్ము రోడ్లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ, ఝార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు.
బిజీగా ధోని
ట్రాఫిక్ చలాన్లు, ఇతర వివాదాలపై అవగాహన లేని ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. 44 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో (రూ. 4 కోట్లు) అతను ఎంపికయ్యాడు.
గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోని వ్యక్తిగంతా రాణించాడు (135.17 స్ట్రైక్ రేట్తో 196 పరుగులు). ధోనికి వయసు మీదపడినప్పటికీ.. ఆయన వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ CSKకి కీలకంగా మారాయి.
ఈసారి జట్టు పునర్నిర్మాణ దశలో ఉన్నందున ధోని చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ లాంటి చాలామంది కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనిదే కీలకపాత్ర.


